Tuesday, November 30, 2010

అన్నమయ్య

అన్నమయ్య

అచ్చ తెలుగుదనాన్ని తేనెలో ముంచి తీసినంత తియ్యగా..

హృదయానికి అతి దగ్గరగా దూసుకుపోయే పదాలు ఆయన పాటల్లో ఉంటాయి. ఆయన కీర్తనల్లో భక్తి ఉంటుంది.. రక్తి ఉంటుంది.. తత్వం ఉంటుంది.. తన్మయత్వం ఉంటుంది. ఆయనే తాళ్ళపాక అన్నమాచార్యులు. ఈనాటి తెలుగు వెండితెరకు కూడా ఆయన పరోక్షంగా పాటలు అందించాడు. శతాబ్దాలుగా తన పాటలతో తెలుగు వారిని అలరిస్తున్నాడు ఈ తొలి తెలుగు వాగ్గేయకారుడు. అన్నమయ్య జయంతి సందర్భంగా ఆయన గీతాలను ఓసారి ఆస్వాదిద్దామా..


చందమామ రావే జాబిల్లి రావే అంటే తిరుమలేశుడు ముద్దలు తిన్నాడో తినలేదో కానీ, పిల్లలు మాత్రము గబుక్కున తింటారు. జోఅచ్యుతానంద జో జో ముకుందా అంటే ముకుందుడు నిద్ర పోతాడో లేదో కానీ పిల్లలు మాత్రం హాయిగా నిద్ర పోతారు. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి ఆరువందల ఏళ్ళు దాటుతున్నా తెలుగు సంస్కృతిలో ఒక భాగమై పోయాయి. జనాల నోళ్ళలో నాటుకొని పోయాయి.

తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు - ఇలా మొత్తం ముప్పై రెండు వేల పాటలు రాసాడు.

అన్నమయ్య 1408 మే 9న కడప జిల్లా రాజంపేట మండలం తాళ్ళపాకలో జన్మించాడు. తెలుగు సాహితీ చరిత్రలో ఆయనను మొదటి వాగ్గేయకారుడు చెప్పుకుంటారు.

8 వ ఏట ఎవరికీ చెప్పకుండా అన్నమయ్య కాలినడకన తిరుపతి బయలుదేరాడట. సంప్రదాయం తెలియక తిరుమల కొండను చెప్పులతో కొండనెక్కుతుండగా అలసిపోతుండగా, అప్పుడు ఆయనకు కలలో అలివేలు మంగమ్మ దర్శనమిచ్చి పరమాన్నాన్ని ప్రసాదించి, పాదరక్షలు లేకుండా కొండనెక్కమని చెప్పిందట. అప్పుడు పరవశించి అలమేలుమంగను కీర్తిస్తూ అన్నమయ్య శ్రీవేంకటేశ్వర శతకము రాశాడు.

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రాశాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి.

తెలుగులో నాగార్జున నటించిన అన్నమయ్య సినిమా భారీ సక్సెస్‌‌ సాధించింది. అందులోని పాటలు ప్రేక్షక హృదయాలకు తాకాయి.

95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపిన అన్నమయ్య 1503 ఫిబ్రవరి 23న పరమపదించాడు. రాగిరేకులమీద రాసిన తిథుల కారణంగా అన్నమయ్య జన్మ, మరణ రోజులు వెలుగులోకి వచ్చాయి.

అన్నమయ్య రచనలలో భక్తి, సంగీతము, సాహిత్యము, శృంగారము, వేదాంతము అత్యంత మనోహరంగా, వినసొంపుగా ఉండడంతో తరాలుగా ఆ పాటలు ఉర్రూతలూగిస్తూనే ఉన్నాయి.

No comments: